
నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :విద్యార్థులు మత్తుకు కాదు, భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, యువతకు పిలుపునిచ్చారు. నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కళాశాల విద్యార్థులతో జరిగిన ఈ సమావేశంలో అధికారులు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే మానసిక, శారీరక, సామాజిక ప్రభావాలపై విశ్లేషణాత్మకంగా వివరించారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు లోనుకాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ వాడకం చదువుపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని, వ్యసనానికి లోనైన వారు నేరాలకు పాల్పడే అవకాశం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఒకప్పుడు డ్రగ్స్ ప్రభావం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండేది, అయితే ఇప్పుడు అది గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఆందోళన కలిగించే అంశమని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు కూడా దీనివల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో చదువుకుంటూ ముందుకు సాగాలని, నా జీవిత ఉన్నతి, నా కుటుంబ బాధ్యత – ఇవే నాకు ముఖ్యమని, డ్రగ్స్ కి నా జీవితంలో స్థానం లేదు అనే సంకల్పంతో ఉండాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాను నిర్మించడంలో విద్యార్థులే సైనికుల్లా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ డ్రగ్స్ రవాణా, వాడకం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనల గురించి నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. 100 లేదా 112 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని, ఇచ్చే సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు సమాజాన్ని మార్చగల శక్తి కలవారని, డ్రగ్స్ అనే అనర్థాన్ని తిప్పికొట్టడంలో వారు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు, ఆరోగ్యంగా, సుస్థిర ఆలోచనలతో ఎదగాలి. డ్రగ్స్ అనే అగ్ని నుంచి మీరే మిమ్మల్ని రక్షించుకోవాలి. పోలీసులు మీతో ఉన్నారు, ధైర్యంగా ముందుకు రండి అని స్పష్టం చేశారు. అనంతరం డ్రగ్స్ రహిత అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన డ్రగ్స్ రహితపై చిత్రలేఖన పోటీల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాసులు, సీనియర్ లెక్చరర్లు అకాడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ అంజయ్య, కళాశాల యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ వనిత, నాగర్ కర్నూల్ సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.