ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ

  • ఆరుగురికి మళ్లీ నోటీసులు

తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ దృష్టి సారించారు. ఈ విచారణలో భాగంగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నేతలకు కూడా ఆయన తాజా నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి మరిన్ని వివరాలను సమర్పించాలని ఈ నోటీసుల్లో కోరారు. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఉన్నారు. గతంలో స్పీకర్ పంపిన నోటీసులకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సమాధానాలను సమర్పించారు. అయితే, ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్‌ గత సోమవారం అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి రిజాయిండర్లు (వివరణకు ప్రతి వివరణ) అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు చట్టం నుంచి తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారు దొంగలుగా మిగిలిపోయారని వారు వ్యాఖ్యానించారు. “రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో మూటలతో దొరికి తప్పించుకున్నారు, మేము తప్పించుకోలేమా అని వీరు అనుకుంటున్నారు. ఇక్కడ తప్పించుకున్నా న్యాయస్థానం ముందు తప్పించుకోలేరు. వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే తీర్పు చెబుతారు” అని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. స్పీకర్ తాజా నోటీసులతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *